¤ భారత ఎగుమతులు అక్టోబరులో కేవలం 10.8 శాతం మేర పెరిగి, 19.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది గత రెండేళ్లలో అతి తక్కువ స్థాయి కావడం గమనార్హం.
¤ అక్టోబరులో దిగుమతులు 21.7 శాతం మేర వృద్ధి చెంది, 39.5 బిలియన్ డాలర్ల మేరకు నమోదయ్యాయి. ఫలితంగా విదేశీ వాణిజ్య లోటు 19.7 బిలియన్ డాలర్లుగా లెక్క తేలింది. గత నాలుగు సంవత్సరాల్లో ఇది అత్యధికం. ¤ ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య ఎగుమతులు మొత్తం 179.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది 45.9 శాతం వృద్ధిని సూచిస్తోంది. దిగుమతులు అదే ఏడు నెలల కాలంలో 30.9 శాతం మేరకు పెరిగి 273.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య లోటు 93.7 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
¤ రాష్ట్ర అప్పులు 2010-11 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1,32,805 కోట్లకు చేరాయి. 2007-08 కి ఈ రుణం రూ.97వేల కోట్లు కాగా, 2008-09 కి రూ.1.06 లక్షల కోట్లు, 2009-10 కి రూ1.19 లక్షల కోట్లకు చేరింది.
¤ దేశంలోని 28 రాష్ట్రాల మొత్తం అప్పు రూ.17.83 లక్షల కోట్లు కాగా రూ.2.24 లక్షల కోట్ల అప్పుతో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్పై రూ.2.23 లక్షల కోట్లు, పశ్చిమ బెంగాల్పై రూ.1.90 లక్షల కోట్లు, గుజరాత్ పై రూ.1.36 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ వరుసలో మన రాష్ట్రం అయిదో స్థానాన్ని ఆక్రమించింది. ¤ ఆర్థిక శాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా పార్లమెంటులో ఈ వివరాలు వెల్లడించారు.
¤ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) కింద ఏడాదికి రూ.లక్ష వరకూ డిపాజిట్లను అనుమతించాలని బ్యాంకులను రిజర్వు బ్యాంకు కోరింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని 25 బ్యాంకులు పీపీఎఫ్ పథకం కింద డిపాజిట్లను స్వీకరిస్తున్నాయి.
¤ పీపీఎఫ్ వార్షిక పొదుపు పరిమితిని ఇటీవల ప్రభుత్వం రూ.70 వేల నుంచి రూ.లక్షకు పెంచింది. వడ్డీ రేటును కూడా 8 శాతం నుంచి 8.6 శాతానికి సవరించింది. శ్యామలా గోపీనాథ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా వడ్డీరేటు పెంపు నిర్ణయం తీసుకున్నారు. ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలలకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2,35,333 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే కాలం వసూళ్లు రూ.2,16,628 కోట్లతో పోలిస్తే 8.63 శాతం పెరిగాయి. ¤ ఏప్రిల్- నవంబరు నెలల్లో స్థూల పన్ను వసూళ్లు 19.56 శాతం పెరిగి, రూ.2,54,268 కోట్ల నుంచి రూ.3,04,002 కోట్లకు చేరాయి. ఈ కాలంలో ఆదాయపు పన్ను విభాగం రూ.68,669 కోట్లను రిఫండ్ చేసింది. ¤ ఏప్రిల్- నవంబరు నెలలకు స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 19.61 శాతం పెరిగి రూ.1,66,638 కోట్ల నుంచి రూ. 1,99,317 కోట్లకు, నికర వసూళ్లు 5.65 శాతం పెరుగుదలతో రూ.1,46,279 కోట్లకు చేరాయి. ¤ స్థూల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు 19.44 శాతం వృద్ధితో రూ.1,04,176 కోట్లకు, నికర వసూళ్లు 14 శాతం పెరుగుదలతో రూ.88,567 కోట్లకు పెరిగాయి.
¤ అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఎదురవడంతో నవంబరు నెలలో భారత ఎగుమతులు 22.3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. దిగుమతులు మాత్రం 35.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
¤ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ - నవంబరు) దేశ ఎగుమతులు 192.7 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 309.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్య లోటు 116.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ¤ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో పరోక్ష పన్ను వసూళ్లు 16.8 శాతం వృద్ధితో రూ.2,52,544 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్-నవంబరులో ఎక్సైజ్ సుంకాల వసూళ్లు రూ.94,441 కోట్లకు చేరుకున్నాయి. ఇక కస్టమ్స్ సుంకాల వసూళ్లు రూ.1,00,062 కోట్లుగా నమోదయ్యాయి. డిసెంబరు 11 ¤ గెయిల్ ఇండియా 20 సంవత్సరాల పాటు ద్రవీకృత సహజవాయువు (ఎల్ఎన్జీ) కొనుగోలుకు అమెరికా సంస్థ సబైన్పాస్ లిక్విఫాక్షన్ ఎల్ఎల్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఏటా 3.5 మిలియన్ టన్నుల చొప్పున ఎల్ఎన్జీని ఇరవై ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది.
¤ అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు పరిశ్రమలను దెబ్బతీయడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) అనూహ్యరీతిలో పతనమైంది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది అక్టోబరులో ఐఐపీ 5.1 శాతం వ్యతిరేక వృద్ధిని నమోదు చేసింది.
¤ 2010 అక్టోబరులో ఐఐపీ, అంతకు ముందు ఏడాది అక్టోబరుతో పోల్చినపుడు 11.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. కానీ, ఈ ఏడాది అక్టోబరులో మాత్రం, 2010 అక్టోబరుతో పోల్చినపుడు మైనస్ 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది.
¤ రిజర్వ్ బ్యాంకు మధ్యంతర పరపతి విధాన సమీక్షను నిర్వహించింది. ద్రవ్యోల్బణ కట్టడి కోసం మార్చి 2010 నుంచి 13 సార్లు కీలక రేట్లను పెంచిన రిజర్వు బ్యాంకు ఈసారి రేట్లలో ఏ మార్పూ చేయలేదు.
¤ దీంతో రెపో రేటు 8.5 శాతం, రివర్స్ రెపో 7.5 శాతం, సీఆర్ఆర్ 6 శాతం వద్దే ఉండిపోయాయి.
¤ రాష్ట్రాల తలసరి ఆదాయాలను ప్రణాళికా సంఘం విశ్లేషించింది. రాష్ట్రంలో 2010-11లో తలసరి ఆదాయం రూ.60,458గా తేలినట్లు ప్రణాళికా సంఘం ప్రకటించింది. 2010-11లో దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు తలసరి ఆదాయం రూ.54,835.
¤ లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువ హోదాను భారత స్టాక్ మార్కెట్ కోల్పోయింది. రూపాయి క్షీణత వల్ల స్క్రిప్ల ధరలు పతనం కావడంతో మార్కెట్ విలువ 994.97 బిలియన్ డాలర్ల (రూ.52,60,440.78 కోట్ల) కు పరిమితమైంది.
¤ 2010-11లో రాష్ట్ర ఐటీ రంగం ఎగుమతులు రూ.35,022 కోట్లకు చేరాయి. 2009-10 ఎగుమతులు రూ.33,482 కోట్లతో పోలిస్తే 4.6 శాతం వృద్ధి లభించింది. దేశీయ ఐటీ రంగంలో రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. 2010-11లో దేశీయ ఐటీ ఎగుమతులు రూ.2,52,374 కోట్లలో రాష్ట్రవాటా 13.9 శాతం.
¤ రాష్ట్రం నుంచి వివిధ రంగాల్లో జరిగిన మొత్తం ఎగుమతులు రూ.91,614 కోట్లలో ఐటీ వాటా 38.22 శాతం. రాష్ట్రంలో 2010లో 44 కొత్త ఐటీ యూనిట్లు ఏర్పాటవగా, 2011లో కొత్తగా నెలకొల్పినవి 46. |
Monday, July 21, 2014
డిసెంబరు 2011 - ఆర్థికరంగం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment